భారత్-పాకిస్తాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా హై లెవల్ భేటీ నిర్వహించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కీలక భేటీ ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొనడం భేటీ ప్రాధాన్యతను హైలైట్ చేస్తోంది.

ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించినప్పటికీ, పాకిస్తాన్ మరోసారి మోసపూరితంగా ప్రవర్తించడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కాల్పుల విరమణ ప్రకటన చేసిన కొద్ది గంటలలోనే, పాక్ మరోసారి దాడులకు దిగింది. కాశ్మీర్, నాగ్రోటా ప్రాంతాల్లో డ్రోన్లు, మోర్టార్లతో దాడులకు పాల్పడిన పాకిస్తాన్, కాల్పుల విరమణ ఒప్పందాన్నిలభించింది. పాకిస్థాన్ ను మరోసారి నిలువరించాలన్న దానిపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ చర్చిస్తున్నారు. పాకిస్థాన్ పై మరోసారి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఈ సమావేశం సాగుతోంది.
భద్రతా చర్యలు – సైనిక సన్నద్ధతపై చర్చ
ఈ సమావేశంలో భారత్ సైనిక ప్రతిస్పందనపై చర్చ జరగినట్లు సమాచారం. సరిహద్దుల్లోని పరిస్థితి, సైనికుల తాకిడి సామర్థ్యం, సాంకేతిక పరంగా ఉన్న పరిష్కారాలు – అన్నింటిపై సమీక్ష జరిగింది. పాకిస్తాన్ చర్యలకు గట్టి బదులు ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ వ్యక్తపరిచినట్లు కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలపై డ్రోన్ దాడులకు పాల్పడింది. భారత రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నప్పటికీ, అణ్వస్త్ర దేశాలైన ఇరు దేశాల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమవుతాయేమోనన్న భయాలు వ్యక్తమయ్యాయి. అయితే, కొద్ది గంటల తర్వాత పరిస్థితి కొంత చల్లబడినప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం ఇంకా భయాందోళనలతోనే గడుపుతున్నారు. నగ్రోటా వద్ద భారత్ లోకి చొరబడేందుకు పాకిస్థాన్ యత్నం చేసింది. అయితే చొరబాటుదారులపై భారత ఆర్మీ కాల్పులు జరిపింది. మోదీ నివాసంలో జరుగుతున్న తాజా సమావేశంలో సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.