కర్ణాటక (Karnataka) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక-ఆర్థిక సర్వే (Socio-Economic and Caste Census) వివాదాస్పద దశకు చేరుకుంది. ఈ సర్వేలో పాల్గొనడానికి ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy), ఆయన భార్య, ప్రసిద్ధ రచయిత్రి సుధా మూర్తి (Sudha Murthy) నిరాకరించడం పెద్ద చర్చకు దారితీసింది. తమను ఈ సర్వేలో చేర్చడం అవసరం లేదని, ఎందుకంటే తాము ఏ వెనుకబడిన వర్గానికి చెందని వాళ్ళం కాదని వారు స్పష్టం చేశారు.
Read Also: రేపు ఐపిఎస్ ప్రొబేషనరీల దీక్షాంత్ పరేడ్
సమాజంలోని అన్ని వర్గాల స్థితిగతులను తెలుసుకోవడం, ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేసే విధానాల రూపకల్పన కోసం ఈ సర్వే ప్రారంభమైంది. అయితే, మూర్తి దంపతులు అధికారులకు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయం తెలియజేశారు. “ఈ సర్వే (Survey) ద్వారా ప్రభుత్వానికి మా నుంచి ఎలాంటి అదనపు సమాచారం లేదా ప్రయోజనం లభించదని భావిస్తున్నాం” అని వారు పేర్కొన్నారు. వారు ఈ వ్యాఖ్యను సర్వే ఫారమ్పైనే రాసి సంతకం చేయడం విశేషం.

ఇదిలా ఉండగా, సర్వే ప్రారంభమైన వారం రోజుల్లోనే అనేక సమస్యలు తలెత్తాయి. బెంగళూరు నగరంలోని పలువురు నివాసితులు అధికారులు, ఉపాధ్యాయులు తమపై బలవంతంగా సర్వేలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. హెబ్బాళ్ (Hebbal) ప్రాంతానికి చెందిన ఓ నివాసి మీడియాతో మాట్లాడుతూ, “నేను సర్వేలో పాల్గొననని చెప్పినా, వచ్చిన టీచర్ పట్టుబట్టారు. నేను ఒప్పుకోకపోతే నా మీద చర్యలు తీసుకుంటారని, ఆమె జీతం తగ్గిస్తారని కూడా చెప్పారు. దీంతో మానసికంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది” అని తెలిపారు.
ఒక వర్గం దీనిని ప్రైవసీ ఉల్లంఘనగా చూస్తోంది
కర్ణాటక (Karnataka) ప్రభుత్వం ఈ సర్వేను సామాజిక న్యాయానికి కీలకమైన అడుగుగా చూస్తోంది. ముఖ్యంగా వర్గాల వారీగా డేటా సేకరించి, భవిష్యత్తులో సంక్షేమ పథకాలను రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఇది చేపట్టింది. కానీ ప్రజలలోని ఒక వర్గం దీనిని ప్రైవసీ ఉల్లంఘనగా చూస్తోంది. వ్యక్తిగత వివరాలు ప్రభుత్వ డేటాబేస్లో చేరడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సర్వేలోని ప్రశ్నలు మరీ ఎక్కువగా, విసుగు తెప్పించేలా ఉన్నాయని స్వయంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Sivakumar) అభిప్రాయపడ్డారు. సర్వే ప్రారంభమైన మొదటి రోజే ఆయన ఇందులో పాల్గొన్నారు. ప్రశ్నల సంఖ్యను తగ్గించి, ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. “నగరాల్లో ప్రజలకు అంత ఓపిక ఉండదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
సర్వేలో పాల్గొనాలని ఎవరినీ బలవంతం చేయబోమని
అదే సమయంలో, మూర్తి దంపతుల నిర్ణయం పూర్తిగా వారి వ్యక్తిగతమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనాలని ఎవరినీ బలవంతం చేయబోమని, ఇది పూర్తిగా స్వచ్ఛందమని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85.89 శాతం సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం చెబుతున్నా, గ్రేటర్ బెంగళూరు పరిధిలో మాత్రం కేవలం 19.62 శాతమే పూర్తి కావడం గమనార్హం. ఇది నగరంలో సర్వే ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పడుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: