పెళ్లంటే రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, జీవితాంతం కలసి జీవించేందుకు ఏర్పాటు చేసుకునే వేడుక. ఆనంద పొదరిట్లో మనసుకు మనసై తోడుగా జీవిస్తే.. ఇక ప్రపంచంతో
పనేముంటుంది? అనుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది, మరి కష్టాలు, సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకుంటారు? ఎలా పరిష్కరించుకుంటారు? ఏ పెళ్లికైనా కుటుంబ సభ్యుల మద్దతు
ఉండాలి. అప్పుడే ఇద్దరిమధ్య విభేదాలు వస్తే సర్దిచెబుతారు, రాజీకి యత్నిస్తారు. అందుకే ఆ గ్రామస్తులంతా ఏకమైన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటా నిర్ణయమని అనుకుంటున్నారా?

అయితే ఈ వార్త మీరే చదవండి..
పంజాబ్లోని చండీగఢ్ (Chandigarh) నుండి కేవలం 10కిలోమీటర్ల దూరంలో ఉన్న మోహాలీ జిల్లాలో ఉన్న మనకపూర్ షరీఫ్ అనే గ్రామం ఇటీవల ఒక వివాదాస్పద తీర్మానాన్ని ఆమోదించింది. గత
మాసం 31వ తేదీన ఏకగ్రీవంగా ఆమోదించబడన ఈ తీర్మానంలో తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల అనుకమతి లేకుండా ప్రేమ వివాహాలు (Love marriage) చేసుకునే జంటని గ్రామం నుంచి వెలి వేయాలని పేర్కొన్నారు.
కఠిన చర్యలుంటాయి
కుటుంబ అనుమతి లేకుండా కోర్టు వివాహాలు చేసుకున్న లేదా పారిపోయి పెళ్లి చేసుకున్న ఏ యువకుడు లేదా యువతిని గ్రామంలో నివసించడానికి అనుమతించరని గ్రామస్థులంతా
తీర్మానిచ్చారు. అటువంటి జంటలకు ఆశ్రయం కల్పించే లేదా వారికి సహాయం చేసే గ్రామస్తులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని నిర్ణయం తీసుకున్నారు.
కుటుంబ విలువలను కాపాడేందుకే ఈ నిర్ణయం: సర్పంచ్
ఈ నిర్ణయంపై ఆ గ్రామ సర్పంచ్ దల్వీర్ సింగ్ (Dalveer Singh) మాట్లాడుతూ ఇది కుటుంబ విలువలను, సంప్రదాయాలను కాపాడటానికే అని చెప్పారు. ఇది శిక్ష కాదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకున్న నివారణ చర్య మాత్రమే అని వివరించారు. ఈ తీర్మానంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇది రాజ్యాంగ విరుద్దమని, ప్రేమ వివాహాలు (Love marriage) చేసుకునే హక్కును ఇది హరిస్తుందని మానవ హక్కుల కార్యకర్తలు, కొంతమంది రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు.
అధికారిక ఫిర్యాదు అందలేదు
మోహాలీ జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ సోనమ్ చౌదరి ఈ విషయంపై స్పందిస్తూ, ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు రాలేదని, ఒకవేళ ఫిర్యాదు వస్తే చట్ట ప్రకారం
చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యక్తులు పెద్దవారైతే తమకు నచ్చిన వారిని వివాహం చేసుకునే చట్టబద్ధమైన హక్కు వారికి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల 26 ఏళ్ల దవీందర్ అనే వ్యక్తి తన 24 ఏళ్ల మేనకోడలు బేబీని ప్రేమ వివాహం చేసుకున్న సంఘటన తర్వాత ఈ తీర్మానం తీసుకురాబడిందని ఆయన వివరించారు. అప్పటి నుండి ఈ జంటను గ్రామం నుంచి వెలివేశారు, ఈ ఘటన ఇక్కడ నివసిస్తున్న 2,000 మంది గ్రామస్తులపై ప్రభావం చూపుతోంది.
తాలిబానీ రాజ్య ఏలుతోంది..
పాటియాలా కాంగ్రెస్ ఎంపీ ధరంవీర్ గాంధీ ఈ తీర్మానాన్ని ఖండిస్తూ, దీనిని తాలిబానీ ఆదేశాలుగా అభివర్ణించారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది పాథమిక హక్కు అని ఆయన అన్నారు. పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజ్ లల్లి గిల్ ఈ తీర్మానాన్ని రాజ్యాంగ విరుద్ధమన్నారు. నిజమే పెళ్లంటే ఇష్టమైన వ్యక్తి చేసుకున్నప్పుడే వారు కలకాలం కలిసి హ్యాపీగా జీవిస్తారు. ఆచారాలు, సంప్రదాయాలు ముఖ్యమే అయినా పెళ్లి అనేది ఇద్దరి ఇష్టాలతో ముడిపడి ఉంటుందే తప్ప ఆచారాలు, మతాలు కావని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: