కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor)ను ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మాకు దేశమే తొలి ప్రాధాన్యం. కానీ, కొందరికి ప్రధాని మోదీనే ప్రాధాన్యం’ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor).. మోదీ (Pm Modi) ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ గత కొంత కాలంగా సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ ప్రచారం కోసం అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించడానికి శశిథరూర్ను మోదీ ప్రభుత్వం ఎంపిక చేసినప్పటి నుంచి థరూర్-కాంగ్రెస్ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇలా మోదీని పదేపదే ప్రశంసిండచంపై కాంగ్రెస్ అధిష్ఠానం థరూర్పై గుర్రుగా ఉంది.

రాజ్యాంగ పరిరక్షణపైనే మా దృష్టి
విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ .. ‘శశి థరూర్ ఆంగ్ల భాషలో నిష్ణాతులు. ఆయన భాష చాలా బాగుంది. అందుకే ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిని చేశాం. ఆయన వ్యాఖ్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. దేశ క్షేమం, రాజ్యాంగ పరిరక్షణపైనే మా దృష్టి. మేము దేశం కోసం కలిసి నిలబడతాం. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా దేశం కోసమే నిలబడ్డాం. మాకు దేశమే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే పార్టీ. కానీ కొంతమందికి మాత్రం ప్రధాని మోదీయే తొలి ప్రాధాన్యం’ అంటూ వ్యాఖ్యానించారు.
దౌత్యపరమైన కృషి
శశిథరూర్ రాసిన వ్యాసాన్ని ప్రధాని కార్యాలయం సోమవారం ఎక్స్లో పోస్టు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశం ఒంటరిగా ఉందంటూ మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు విరుద్ధంగా ఆ వ్యాసంలో థరూర్ అభిప్రాయాలు ఉండటం గమనార్హం. ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత జరిగిన దౌత్యపరమైన కృషి జాతీయ సంకల్పం, ప్రభావవంతమైన వ్యక్తీకరణకు రుజువుగా పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలు, ఆపరేషన్ సింధూర్తో భారత్ దృఢమైన ప్రతిస్పందనను చాటి చెప్పిందని తెలిపారు. ఇది మన విదేశాంగ విధానానికి కీలక ఘట్టాన్ని అందించిందని వ్యాఖ్యానించారు.
Read Also:Cabinet: కొత్త తరానికి ఎమర్జెన్సీ గురించి తెలియాలి.. కేంద్ర కేబినెట్