భారత రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defense of India) భారత భద్రతా బలగాల గోప్యతకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని సర్వీసులో ఉన్న లేదా రిటైర్డ్ అయిన ఆర్మీ (Retired Army) సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలను బహిరంగంగా వెల్లడించకూడదని స్పష్టమైన నిషేధం విధించింది. ఎలాంటి సోషల్ మీడియా వేదికలలోనూ లేదా ఇతర ఆన్లైన్ ఫ్లాట్ఫామ్స్లోనూ వారి చిరునామాలు, ఫోటోలు లేదా వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని స్పష్టం చేసింది.
భద్రతా విభాగాల సమాచారం లీక్ కాకుండా నివారించడం
ఈ ఆదేశాలు వ్యక్తుల భద్రతను కాపాడడం, భద్రతా విభాగాల సమాచారం లీక్ కాకుండా నివారించడం కోసం తీసుకున్న చర్యగా అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో ఆర్మీ సిబ్బంది గురించి మీడియా లేదా సోషల్ మీడియాలో వ్యక్తిగత కథనాలు, ఇంటర్వ్యూలు ఎక్కువగా వెలుగులోకి రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మీడియా సంస్థలు కూడా అధికారికంగా విడుదల చేసిన సమాచారమే ప్రచురించాలి కానీ, స్వయంగా సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించకూడదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దేశ భద్రత, సైనికుల వ్యక్తిగత భద్రత
రక్షణ మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలతో భద్రతా విభాగాల్లో నియమాలు మరింత కఠినంగా అమలులోకి వస్తున్నాయి. దేశ భద్రత, సైనికుల వ్యక్తిగత భద్రత కీలకమని భావిస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అవసరమైందని అధికారులు వెల్లడించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రక్షణ శాఖ హెచ్చరించింది.
Read Also : Shashi Tharoor : చైనాపై శశిథరూర్ ఆగ్రహం