దేశ రాజధాని హస్తినలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న తరుణంలో.. ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై హర్యానాలో కేసు నమోదు కావడం తీవ్ర సంచలనంగా మారింది. ఇటీవల కేజ్రీవాల్ యమునా నదిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే విషం కలిపిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది.ఈ క్రమంలోనే షాబాద్ కు చెందిన జగన మోహన్ అనే లాయర్ మాజీ సీఎంపై కురుక్షేత్ర పోలీసులకు కంప్లైంట్ చేశారు. అసత్య ఆరోపణలతో కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బీఎన్ఎస్ 192, 196 (1) సహా పలు సెక్షన్ల కింద కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే ప్రధాని మోడీ, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ స్పందించి ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ.. కేజ్రీవాల్ ఆరోపణలపై ఫైర్ అయ్యారు. నయాబ్ సింగ్ యమునా నీటిని తాగి కేజ్రీవాల్ కు కౌంటర్ ఇచ్చారు.మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేష్ మోహానియాపై కూడా కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో దినేష్ ఓ మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.