ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం.. ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ను మార్చేయబోతుంది. సహజీవనం, పెళ్లి, విడాకులు, వారసత్వం, పిల్లల దత్తత విషయంలో అందరికీ ఒకే రూల్ ఉండేలా… జనవరి 26వ తేదీ నుంచి ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయబోతుంది. ముఖ్యంగా భారత దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా కూడా ఉత్తరాఖండ్ రికార్డులోకి ఎక్కబోతుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. 2025లో యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే గణతంత్ర దినోత్సవం నాటి నుంచి ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు ఇటీవలే మహూర్తం ఖరారు చేశారు.

ముఖ్యంగా వివాహం, విడాకుల విషయంలో అనేక సంస్కరణలు రాబోతున్నాయి. అన్ని కమ్యూనిటీల్లోనూ బహు భార్యత్వం నిషేధం కానుంది. అలాగే త్రిపుల్ తలాక్, ఖులా, జిహర్ వంటి పద్దుతుల్లో సహా న్యాయ విరుద్ధమైన విడాకులను నేరంగా పరగణిస్తారు. ఎవరి మతాలు, ఆచారాల ప్రకారం వాళ్లు చేసుకునే పెళ్లిళ్లకు గుర్తింపు లభిస్తుంది. అయితే వివాహం చేసుకున్న జంటలు కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా చేయడని పక్షంలో 25 వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే సహజీవనం ప్రారంభించిన నెలలోపే జంటలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. లేని పక్షంలో మూడు నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే పౌరులు వీలునామాలు, అప్పళ్లు, ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. వీరందరికీ అందుబాటులో ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారు. అయితే యూనిఫాం సివిల్ కోడ్ అమలు కోసం రాష్ట్ర సర్కారు మౌలిక సదుపాయలను కూడా కల్పించింది.