కర్ణాటకలోని ధర్మస్థల (Dharmasthala ) ప్రాంతంలో సంచలనకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేత్రావతి నది ఒడ్డున శవాలు పాతిపెట్టినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది. మాజీ శానిటరీ వర్కర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు జేసీబీలతో తవ్వకాలు ప్రారంభించారు. అయితే విస్తారమైన వర్షాల కారణంగా తాత్కాలికంగా కొంత ఆటంకం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు.
శానిటరీ వర్కర్ చూపిన ప్రాంతాల్లో తవ్వకాలు
తాను గతంలో అక్కడ పలు శవాలను పాతిపెట్టానంటూ ఒక మాజీ శానిటరీ వర్కర్ అధికారులకు వివరాలు వెల్లడించడంతో విచారణ మరింత తీవ్రత తీసుకుంది. అతడు స్పష్టంగా చూపించిన కొన్ని ప్రాంతాల్లోనే తవ్వకాలు ప్రారంభించారు. అధికారుల సూచనల మేరకు, జేసీబీలతో ముందు జాగ్రత్త చర్యలతో తవ్వక కార్యక్రమాన్ని చేపట్టారు.
తదుపరి దశలో పూర్తిస్థాయిలో తవ్వకాలు
ఇప్పటి వరకు చేపట్టిన తవ్వకాలు ప్రారంభ దశలో ఉన్నాయని, వర్షాలు తగ్గిన వెంటనే పూర్తిస్థాయిలో తవ్వకాలను కొనసాగిస్తామని SIT అధికారులు స్పష్టం చేశారు. ఘటనపై మరిన్ని ఆధారాలు సేకరించి, అవసరమైతే నేరపూరిత విచారణ కూడా చేపడతామని వారు పేర్కొన్నారు. ఈ ఘటన ధర్మస్థల ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also : UPI : ఇకపై పిన్ అవసరం లేకుండానే యూపీఐ పేమెంట్లు చేయొచ్చు !!