తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM Stalin) ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనకు ఒక్కసారిగా నీరసం వచ్చింది. దీనితో ఆయన కళ్ళు తిరిగి నేలపై పడిపోయారు. వెంటనే అతని సిబ్బంది అప్రమత్తమై ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే హుటాహుటిన వైద్య సిబ్బంది అందుబాటులోకి వచ్చి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.
వైద్యులు చేపట్టిన పరీక్షలు – అపోలో హెల్త్ బులిటెన్ విడుదల
స్టాలిన్కు సంబంధించి ప్రస్తుతం వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అపోలో ఆసుపత్రి (Apollo Hospital) వైద్యులు తెలిపారు. ఆయనకు ఉన్న అస్వస్థత కారణాలు అంచనా వేయడం కోసం బిపి, షుగర్, ఈసీజీ, సిటి స్కాన్ వంటి ముఖ్య పరీక్షలు చేస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ, ప్రస్తుతం సీఎం పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించాయి. ఐనా సరే ముందస్తుగా జాగ్రత్త చర్యలలో భాగంగా ఆయనను పూర్తి వైద్య పర్యవేక్షణలో ఉంచారు.
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం – డిఎంకె నేతలు స్పందన
ముఖ్యమంత్రి స్టాలిన్ అస్వస్థత వార్త తెలిసిన వెంటనే డిఎంకె శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. మంత్రులు, పార్టీ నేతలు, అభిమానులు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. డిఎంకె అధికార ప్రతినిధులు స్టాలిన్ ఆరోగ్యంపై రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయన ఆరోగ్యంపై విచారం వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Read Also : TTD : రేపు ఉదయం 10 గంటలకు తిరుమల టికెట్లు