ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చులు సామాన్యులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వెంటిలేటర్ చికిత్స పేరుతో అనవసరంగా లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం(Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోగి కుటుంబ సభ్యుల స్పష్టమైన ముందస్తు అనుమతి లేకుండా వెంటిలేటర్ చికిత్స ప్రారంభిస్తే, ఆ ఖర్చును చెల్లించాల్సిన బాధ్యత కుటుంబంపై ఉండదని స్పష్టం చేసింది.

వెంటిలేటర్ వాడకంపై DGHS కొత్త నిబంధనలు
వైద్యం వ్యాపారంగా మారుతోందన్న విమర్శల నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని(Central Govt) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వెంటిలేటర్ ప్రాణాలను కాపాడే సాధనంగా ఉండాలి కానీ, ఆదాయ వనరుగా మారకూడదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
కొత్త రూల్స్లో ముఖ్యాంశాలు ఇవే
- ముందస్తు సమాచారం, అనుమతి తప్పనిసరి
రోగిని వెంటిలేటర్పై ఉంచే ముందు పరిస్థితిని పూర్తిగా వివరించి, కుటుంబ సభ్యుల నుంచి వ్రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. - అనుమతి లేకపోతే బిల్లు చెల్లించనక్కర్లేదు
కుటుంబానికి తెలియజేయకుండా వెంటిలేటర్ వాడితే, ఆ చికిత్స ఖర్చును రోగి బంధువులు చెల్లించాల్సిన అవసరం లేదు. - స్పష్టమైన వైద్య కారణాలు అవసరం
శ్వాస సమస్యలు, గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు, తీవ్రమైన గాయాలు వంటి సందర్భాల్లో మాత్రమే వెంటిలేటర్ వినియోగించాలి. - చికిత్స కాలం పెరిగితే మళ్లీ అనుమతి
వెంటిలేటర్ చికిత్సను పొడిగించాల్సి వస్తే, కారణాలు వివరించి మరోసారి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలి. ఖర్చులపై ముందుగానే అవగాహన కల్పించాలి. - 14 రోజులు దాటితే సమీక్ష తప్పనిసరి
రెండు వారాలకు మించి వెంటిలేటర్ అవసరమైతే, ఆసుపత్రిలో ప్రత్యేక ఆడిట్, సమీక్షా కమిటీల పర్యవేక్షణ ఉండాలి. ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి.
నిపుణుల సూచనలతో అమలు
ఢిల్లీ ఎయిమ్స్, సఫ్దర్జంగ్ వంటి ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య నిపుణుల కమిటీ సూచనల మేరకు ఈ మార్గదర్శకాలను రూపొందించారు. దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.