భారతదేశాన్ని ప్రపంచ టెక్నాలజీ మ్యాప్లో అగ్రస్థానానికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో టెక్నాలజీ రంగానికి అపూర్వ ప్రాధాన్యం లభించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ మౌలిక వసతులు, సెమీకండక్టర్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు బాటలు వేసింది.
Read Also: Budget 2026: Orange Economy అంటే ఏంటో తెలుసా?

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నట్లుగా, రాబోయే కాలంలో భారత్ కేవలం ఐటీ సేవల దేశంగా కాకుండా, ప్రపంచానికి అవసరమైన “డిజిటల్ బ్యాక్బోన్”గా ఎదగనుంది. బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యత పొందిన అంశం డేటా సెంటర్లకు ఇచ్చిన పన్ను రాయితీలు. విదేశీ సంస్థలు భారత్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందిస్తే, 2047 వరకు పన్ను మినహాయింపు (టాక్స్ హాలిడే) కల్పించనున్నారు. దాదాపు 21 ఏళ్ల పాటు ఈ వెసులుబాటు ఉండటంతో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతం డేటా సెంటర్ రంగంలో సుమారు 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కొనసాగుతుండగా, సమీప భవిష్యత్తులో మరో 90 బిలియన్ డాలర్లు చేరవచ్చని అంచనా. దీర్ఘకాలంలో ఈ రంగం విలువ 200 బిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0ను ప్రారంభించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.40,000 కోట్లను కేటాయించడం విశేషం. ఇది గత కేటాయింపులతో పోలిస్తే దాదాపు రెట్టింపు. కేవలం చిప్ అసెంబ్లింగ్కే పరిమితం కాకుండా, చిప్ డిజైన్, తయారీ పరికరాల ఉత్పత్తిని కూడా దేశీయంగా చేపట్టే దిశగా ప్రణాళికలు రూపొందించారు.
అదనంగా, పరిశ్రమల ఆధ్వర్యంలో పరిశోధన, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ.1,000 కోట్లు కేటాయించారు. దీని ద్వారా యువతకు అధునాతన సాంకేతిక నైపుణ్యాలు, భారీ ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లో సెమీకండక్టర్ క్లస్టర్లు, కెమికల్ పార్కులు అభివృద్ధి చేయనున్నారు. టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా ఆధునిక డేటా సెంటర్ల ఏర్పాటు కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఏఐ ఆధారిత సేవలు విస్తరించాలంటే శక్తివంతమైన డేటా సెంటర్లు కీలకం. దేశీయంగా ఇవి ఏర్పడితే, డేటా భద్రత మెరుగుపడటంతో పాటు స్టార్టప్లకు తక్కువ వ్యయంతో క్లౌడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఐటీ, సాఫ్ట్వేర్ ఎగుమతుల రంగానికి ఊరట కలిగించేలా ‘సేఫ్ హార్బర్’ నిబంధనలను సవరించారు. ఐటీ సేవల ఎగుమతుల పరిమితిని రూ.300 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పెంచడం వల్ల మధ్యతరహా సంస్థలకు పెద్ద ఉపశమనం లభించనుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ECMS)కి నిధులను రూ.40,000 కోట్లకు పెంచడం ద్వారా భారత్ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చే దిశగా మరో అడుగు పడింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: