Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్షా పై తీవ్ర ఆరోపణలు చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టం-2025కి వ్యతిరేకంగా బెంగాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంలో ఆయన హస్తం ఉందని ఆరోపించారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అని.. ఇందుకోసం అమిత్ షా, బీఎస్ఎఫ్ కలిసి కుట్రపూరితంగా బంగ్లాదేశీయులను రాష్ట్రంలోని వదిలారని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సొంత రాజకీయ అజెండాను నెరవేర్చుకోవడానికి దేశానికి హాని చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ. అమిత్షాను నియంత్రించాలని అన్నారు.

ఘర్షణల్లో బీఎస్ఎఫ్ పాత్రపై దర్యాప్తు
ఈ విషయంపై ప్రజలు శాంతియుత నిరసనలు చేపట్టాలని కోరారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయొద్దని ప్రధానిని కోరారు. హింసాకాండలో మరణించిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల నష్ట పరిహారం ఇస్తామని మమత ఈ సందర్భంగా ప్రకటించారు. ఘర్షణల్లో బీఎస్ఎఫ్ పాత్రపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ముర్షిదాబాద్ అల్లర్ల వెనుక సరిహద్దు అవతల నుంచి వచ్చిన వ్యక్తుల పాత్ర ఉందని నిఘా వర్గాలు తమకు తెలిపాయని మమత పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లోని ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలను బెంగాల్లో జరుగుతున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దీదీ ఆరోపించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమ పార్టీ ముందంజలో ఉందని అన్నారు.
200 మందికి పైగా నిరసన కారులు అరెస్టు
కాగా, ఇటీవల వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హూగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముర్షిదాబాద్ ప్రాంతంలో పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం వంటి ఘటనలతో అక్కడ విధ్వంసం చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా నిరసన కారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది.