రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: నితిన్‌ గడ్కరీ

Read Time:  1 min
nitin gadkari
nitin gadkari
FONT SIZE
GET APP

నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదంలో గాయపడినవారికి చికిత్స వెంటనే అందితే ప్రాణాలతో బయటపడతారు. అందుకు ఆర్థిక సాయం కావాలి. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక పథకాన్ని ప్రకటించారు.

ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ.1.50 లక్షలు ఈ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అయితే ఇది మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే బిల్లుకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రమాద ఘటన జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారాన్ని అందిస్తేనే ఈ స్కీం ద్వారా నగదు రహిత చికిత్సను పొందొచ్చని గడ్కరీ స్పష్టం చేశారు.

ఇప్పటికే ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా హిట్ అండ్ రన్ కేసుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని గడ్కరీ తెలిపారు.

పలు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి గడ్కరీ మంగళవారం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఢిల్లీలోని భారత్‌ మండపంలో మీడియాతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలకే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది చనిపోయారని.. అందులో 30 వేల మంది హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్లే మరణించినట్లు తెలిపారు. మృతుల్లో 66 శాతం మంది 18 నుంచి 34 ఏండ్ల మధ్య వయస్సుగల వారే ఉండటం బాధాకర విషయమన్నారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.