ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఓ వ్యక్తి చూపిన అభిమానం, ఆయన చేసిన వినూత్న ప్రతిజ్ఞ హర్యానాలో చర్చనీయాంశమైంది. హర్యానాలోని యమునానగర్లో జరిగిన బహిరంగ సభలో ఒక సామాన్య అభిమాని కోసం మోదీ చేసిన పనితీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కైథాల్ కు చెందిన రాంపాల్ కశ్యప్ అనే వ్యక్తి 14 ఏళ్ల క్రితం ఓ శపథం చేశారు — “నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆయనను వ్యక్తిగతంగా కలిసే వరకు నేను పాదరక్షలు ధరించను!” అని. ఇది సామాన్యమైన విషయంగా అనిపించినా, ఈ ప్రతిజ్ఞను ఆయన ఏనాడు విడిచిపెట్టలేదు. వేసవి, వర్షాలు, చలికాలం అన్నీ చూసినా — రాంపాల్ తన నిబంధనను విస్మరించలేదు.
ప్రధానితో ముఖాముఖి – ప్రతిజ్ఞకు ముగింపు
2025 ఏప్రిల్ 15న యమునానగర్లో జరిగిన బహిరంగ సభ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రాంపాల్ను కలిశారు. ఆ క్షణం అసాధారణమైనదిగా మిగిలిపోయింది. మోదీ స్వయంగా ఆయనకు పాదరక్షలు తొడిగారు. ఇది ఒక్క రాంపాల్కే గౌరవం కాదు — ఈ దేశంలో భావాల ప్రాముఖ్యతకు, ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవం. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, నేను ఇప్పుడు మీకు పాదరక్షలు తొడుగుతున్నాను, కానీ భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయవద్దు. మీరు పని చేసుకోవాలి, ఇలా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు? అని సూచించారు. ప్రధానిని కలవడం పట్ల రాంపాల్ కశ్యప్ ఆనందం వ్యక్తం చేశారు.ఈ ఘటనను ప్రధాని మోదీ స్వయంగా తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈరోజు యమునానగర్ బహిరంగ సభలో కైథాల్కు చెందిన శ్రీ రాంపాల్ కశ్యప్ను కలిశాను. నేను ప్రధాని అయ్యాక, నన్ను కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని ఆయన 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. రాంపాల్ వంటి వారి పట్ల నేను వినమ్రుడను, వారి అభిమానాన్ని స్వీకరిస్తాను. కానీ ఇలాంటి ప్రతిజ్ఞలు చేసే వారందరినీ కోరుతున్నాను – మీ ప్రేమను నేను గౌరవిస్తాను దయచేసి సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన పనులపై దృష్టి పెట్టండి. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.
Read also: Ayodhya : అయోధ్య రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడ