Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ చొరవతో గుంటూరులోని రమేష్ ఆసుపత్రి నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా ఒక మహిళ గుండెను విజయవంతంగా తరలించారు. చెరుకూరి సుష్మ అనే మహిళ గుంటూరు రమేష్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఆస్పత్రి వైద్యులు ఆమె కుటుంబసభ్యులకు అవయవదానంపై అవహాన కల్పించారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు అవయవదానం చేయడానికి అంగీకరించారు. దీంతో ఆసుపత్రి వైద్యులు మంత్రి నారా లోకేష్ను సంప్రదించారు. అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఆస్పత్రి వైద్యుల అభ్యర్థనకు మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు.

సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు
బ్రెయిన్డెడ్ అయిన మహిళ గుండెను తరలించేందుకు తన సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేయించారు. గుండెను తరలించేందుకు వీలుగా లోకేష్ సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించారు. అలాగే బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను తిరుపతిలోని ఆస్పత్రికి చేరే వరకూ గ్రీన్ఛానల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. లోకేష్ ఆదేశాలతో గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి.. గుండెను తరలించారు. గుంటూరు నుంచి తొలుత గన్నవరం విమానాశ్రయానికి తరలించిన అధికారులు.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి గుండెను తరలించారు. రేణిగుంట నుంచి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి తిరుపతి ఆస్పత్రికి తరలించారు.
వారికి గుండె అందించడం బాధలోనూ సంతోషాన్ని ఇస్తోంది
మరోవైపు తన భార్య అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడినట్లు బ్రెయిన్ డెడ్ అయిన మహిళ భర్త శ్రీనివాస్ తెలిపారు. వెంటనే రమేష్ ఆస్పత్రికి తీసుకొచ్చామని వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె కోమాలోకి వెళ్లారని అన్నారు. ఆ తర్వాత బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు చెప్పారని.. అవయవదానం గురించి వివరించారన్నారు. ఆస్పత్రి యాజమాన్యం, మంత్రి నారా లోకేష్ సహకారంతో తిరుపతిలో ఉన్న వారికి గుండె అందించడం బాధలోనూ సంతోషాన్ని ఇస్తోందని అభిప్రాయపడ్డారు.