Nara Bhuvaneswari : ఏపీ ప్రజలకు స్వాతంత్య్రం లభించింది – నారా భువనేశ్వరి ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించిందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందని, రాష్ట్ర అభివృద్ధి పునరుద్ధరణ సాధ్యమవుతుందని చెప్పారు. చంద్రబాబు పాలన సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు పారిశ్రామికవేత్తలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారంటే అందుకు చంద్రబాబు గారిపై ఉన్న నమ్మకమే ప్రధాన కారణమని ఆమె తెలిపారు.

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి
రెండో రోజు కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి మోడల్ కాలనీ, కృష్ణదాసపల్లి, జరుగు గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.”మహిళలు తమపై నమ్మకం పెంచుకుని ధైర్యంగా ముందడుగు వేయాలి” అని భువనేశ్వరి సూచించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కొంత మంది సాధ్యం కాని హామీలు ఇస్తారని, కానీ చంద్రబాబు గారు మాట ఇచ్చారంటే తప్పకుండా నెరవేరుస్తారని భువనేశ్వరి తెలిపారు. ప్రజలు కాస్త ఓపిక పట్టాలి. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయి. ఒక పెద్ద పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడం అంత తేలికైన పని కాదు. 2019లో చంద్రబాబు గారు తిరిగి అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే, ఈపాటికి ఏపీ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచేది. పోలవరం పూర్తయ్యేది. రాష్ట్రాన్ని చంద్రబాబు గారు అభివృద్ధి పథంలో నడిపిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి సదుపాయం, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు జరుగుతోంది. కుప్పం ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య ఉండకూడదని హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి అందరికీ నీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు స్పష్టంగా తెలుసు. పారిశ్రామిక వేత్తలు కూడా ఏపీ అభివృద్ధికి గత ప్రభుత్వం ఆటంకం కలిగించిందనే విషయం తెలుసుకున్నారు.
డ్వాక్రాతో మహిళల జీవితాల్లో వెలుగులు
నారా భువనేశ్వరి తన పర్యటనలో పాల్గొన్న మహిళలందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు తమలోనే నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలి అని ఆకాంక్షించారు.”మహిళలు ఒక్కసారి ఏదైనా నేర్చుకుంటే, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లగలరు. మహిళలు ఇల్లు, కుటుంబం నడపడమే కాకుండా, ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు వెనకడుగు వేయకూడదు” అని భువనేశ్వరి అన్నారు.”మహిళలు డబ్బు కోసం ఎవరిపైనైనా ఆధారపడకూడదు. ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఉండాలి. అందుకే డ్వాక్రా సంఘాలను చంద్రబాబు గారు తీసుకొచ్చారు. గతంలో వంద, రెండువందల కోసం ఇతరులపై ఆధారపడే మహిళలు ఇప్పుడు బ్యాంకు లావాదేవీలు స్వయంగా నిర్వహించే స్థాయికి ఎదిగారు. ఇది డ్వాక్రా వల్లే సాధ్యమైంది. మగవారి సమానంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటిని సమర్థవంతంగా నడుపుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం వారు వారి సంపాదనను జాగ్రత్తగా వినియోగించుకోవాలి.”వ్యాపారం చేసేందుకు ముందుకు వచ్చినంత మాత్రాన మహిళలు భయపడాల్సిన అవసరం లేదు. నేను కూడా వ్యాపారంలోకి రావడానికి ముందు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడేవాడిని. కానీ నాకు నేను ధైర్యం చెప్పుకున్నప్పుడే విజయం సాధించగలిగాను. మహిళలు తమ గౌరవం కోసం ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఉండాలి” అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
చంద్రబాబు పాలన – భవిష్యత్తు అభివృద్ధికి పునాదే
ఏపీకి నిజమైన అభివృద్ధి కావాలంటే అది చంద్రబాబు గారితోనే సాధ్యమవుతుందని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. “పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమ పథకాలు, పారిశ్రామిక ప్రగతితో యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు అవసరమైన మద్దతుతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి చంద్రబాబు గారికే ఉంది” అని ఆమె తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు. “ప్రస్తుతం ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని, భారతదేశంలోని అత్యుత్తమ రాష్ట్రంగా మార్చేందుకు చంద్రబాబు గారి నాయకత్వం అవసరం” అని భువనేశ్వరి పేర్కొన్నారు.