నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజాగా నాగవంశీ అభిమానులను ఉద్దేశించి, “ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్టు చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్బస్టర్ కావడానికి ప్రయత్నిద్దాం,” అని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తి పెంచడంతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నింపాయి.
సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి 12న ‘డాకు మహారాజ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేశాయి. బాలకృష్ణ విభిన్న గెటప్లో కనిపించనున్న ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
ఇదే సమయంలో, చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్లను నిర్వహిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అభిమానులతో ప్రత్యేక సమావేశాలు, ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సినిమాపై మరింత క్రేజ్ను పెంచుతున్నారు. చిత్ర నిర్మాతలు, నటీనటులు కూడా ప్రమోషన్స్లో చురుకుగా పాల్గొంటున్నారు.