ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో, జనసేన పార్టీ తరఫున ప్రముఖ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు (నాగేంద్ర బాబు) అభ్యర్థిగా ఖరారైనట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండగా, అందులో కటిని జనసేనకు కేటాయించారు. ఆ స్థానం కోసం నాగబాబును ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది అధికార పక్షంలోని రాజకీయ సమీకరణాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు.
రాజకీయాల్లో మరింత ప్రాముఖ్యత
నాగబాబు రాజకీయంగా గత కొంతకాలంగా జనసేనలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. 2019లో నరసాపురం లోకసభ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలైనా, పార్టీ కార్యకలాపాల్లో అంతా ముందుండి పని చేస్తున్నారు. తాజా నిర్ణయం ఆయనను రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రాముఖ్యత కల్పించనుంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత, ప్రభుత్వ వ్యవహారాల్లో నాగబాబుకు కీలక భూమిక ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

త్వరలోనే రాష్ట్ర కేబినెట్లోకి నాగబాబు
ఇక నాగబాబును త్వరలోనే రాష్ట్ర కేబినెట్లోకి తీసుకురావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆయనకు మంత్రిపదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వంలో కీలక సమీకరణాలు జరుగుతుండటంతో, నాగబాబు మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారా? లేదా మరేదైనా కీలక పదవిలో కొనసాగుతారా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
జనసేన శ్రేణుల్లో జోష్
ఈ పరిణామాలు జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. నాగబాబు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారని, పార్టీకి ఇది మరింత బలం చేకూరుస్తుందని నాయకత్వ వర్గం భావిస్తోంది. అధికారంలో జనసేన ప్రభావం మరింత పెంచేందుకు, ఈ నిర్ణయం సహాయపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక అధికారిక ప్రకటన వెలువడిన తరువాత నాగబాబు భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందో చూడాలి.