Earthquake: మయన్మార్ భారీ భూకంపం ధాటికి విలవిల్లాడుతోంది. వరుస భూకంపాల తీవ్రతకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు అక్కడ 103 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరోవైపు, థాయ్లాండ్లో నలుగురు మృతిచెందగా.. 50 మంది గాయపడినట్లు సమాచారం. అలాగే, చైనాలోనూ పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకొని హాహాకారాలు చేస్తున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

ఎత్తైన వంతెన కూలడంతో 90 మంది గల్లంతు
మయన్మార్లోని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి, మాండలే నగరంలో ఐకానిక్ వంతెన, పలుచోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. బ్యాంకాక్లోని నిర్మాణంలో ఉన్న ఎత్తైన వంతెన కూలడంతో 90 మంది గల్లంతైనట్లు థాయ్లాండ్ రక్షణ మంత్రి ప్రకటించారు. శుక్రవారం రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి మయన్మార్, థాయ్లాండ్లోని పలు భవంతులు కుప్పకూలిపోయాయి. మయన్మార్ రాజధాని నగరం నేపిడాలో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు
బ్యాంకాక్లో భూప్రకంపనలతో ఓ భారీ భవంతి పైఅంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోని నీరు కిందకు పడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయ్లాండ్లో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్లో మెట్రో, రైలు సేవలను నిలిపివేశారు.