ముంబై-పూణె ఎక్స్ప్రెస్వే (Mumbai-Pune Expressway)పై శుక్రవారం సాయంత్రం పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్గఢ్ జిల్లాలోని ఖోపోలి సమీపంలో కంటైనర్ ట్రక్కు అదుపుతప్పి దాదాపు 20 కార్లను ఢీకొట్టింది (Truck loses control and hits nearly 20 cars). ఈ ప్రమాదంలో కనీసం 19 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే నవీ ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ముంబై వైపు వెళ్లే మార్గంలో కొత్త సొరంగం దాటిన తర్వాత, ఫుడ్ మాల్ హోటల్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం రద్దీ సమయం కావడంతో ప్రమాదం హైవేపై భారీ ట్రాఫిక్ జామ్కు దారితీసింది. ప్రాథమిక విచారణలో లోనావాలా ఘాట్ నుంచి దిగుతున్న ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయిందని పోలీసులు తెలిపారు.

వాహనాలు ధ్వంసం
ట్రక్కు వేగంగా దూసుకెళ్లి ముందున్న వాహనాలను వరుసగా ఢీకొట్టింది. దాంతో 20కి పైగా కార్లు, ఎస్యూవీలు నుజ్జునుజ్జు అయ్యాయి. వాటిలో బీఎమ్డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అనేక వాహనాల ముందు, వెనుక భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని వాహనాలు రోడ్డుపక్కకు దూసుకెళ్లగా, మరికొన్ని ఒకదానిపై ఒకటి పడిపోయాయి.
సహాయక చర్యలు వేగంగా
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్ బృందాలు, అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. రోడ్డుపై నుంచి దెబ్బతిన్న వాహనాలను తొలగించడానికి క్రేన్లను వినియోగించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం అధికారులు తీవ్రంగా శ్రమించారు.ట్రక్కు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లో అతను మద్యం సేవించలేదని తేలింది. ట్రక్కు బ్రేకులు ఎందుకు ఫెయిల్ అయ్యాయి, సాంకేతిక లోపాలేనా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : APSDMA : నదులకు భారీగా వరద నీరు… ఏపీఎస్డీఎంఏ అలర్ట్