క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ మోసం..
న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. క్రిప్టో కరెన్సీ పేరుతో అధిక లాభం ఆశచూపి 11 మంది నుంచి రూ.3.40 కోట్ల కొల్లగొట్టినట్టు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోయంబత్తూరు ప్రధాన కేంద్రంలో క్రిప్టో కరెన్సీ కంపెనీని 2022లో ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో సినీనటి తమన్నా, ఇతర ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు.

పార్టీకి సెలబ్రిటీలు
అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ సంస్థ కార్యక్రమానికి నటి కాజల్ అగర్వాల్ హాజరయ్యారు. అనంతరం ముంబయిలోని క్రూయిజ్ నౌకలో నిర్వహించి పార్టీకి సెలబ్రిటీలను ఆహ్వానించారు. భారీ ఎత్తున పార్టీ నిర్వహించి, పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ఆకర్షించారు. అనంతరం వేలాది మంది నుంచి అధిక లాభాలను ఆశగా చూపి పుదుచ్చేరిలో రూ.3.4 కోట్లను వసూలు చేశారు. ఈ వ్యవహారంలో నితీష్ జైన్ (36), అరవింద్కుమార్ (40) అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా నటీమణుల విచారణ
బాధితుల నుంచి భారీగా దండుకున్న నిందితులు.. పెట్టుబడులపై అధిక రాబడిని ఇస్తామని హామీ ఇచ్చి ఆకర్షించారన్నారు. కానీ తరువాత వారి మొత్తాన్ని విత్డ్రా చేసుకోకుండా నిరోధించారని, చివరకు అంతా ఫేక్ అని తేలిందని చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నటీమణులు తమన్నా, కాజల్ అగర్వాల్లను విచారించాలని నిర్ణయించారు. పుదుచ్చేరి సైబర్ క్రైమ్ ఎస్పీ డాక్టర్ బాస్కరన్ మాట్టాడుతూ.. సంస్థ ప్రారంభించిన మూడు నెలల్లోనే 100 మంది నుంచి రూ.1.10 కోట్లకుపైగా నిందితులు వసూలు చేశారని చెప్పారు.