కోతుల బెడదను తీర్చే వారికి ఓటేస్తామంటున్న జనం
హైదరాబాద్: ఈసారి పంచాయతీఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ‘కోతుల తిప్పలు’ తప్పేలా లేవు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని, డ్రైనేజీలు కడ్తామని, డ్రింకింగ్వాటర్ ఇస్తామని.. గతంలో ఓట్లు అడిగేవారు. జనం సైతం ఇలాంటి హామీలే కోరుకునేవారు. కానీ ఈసారి గ్రామాల్లో మాత్రం కోతుల బెడదను తీర్చే వారికే ఓట్లేస్తామని జనం అంటున్నారు. గ్రామాల్లో మనుషులపై దాడులు చేస్తూ, పొలాల్లో పంటలను ధ్వంసం చేస్తూ నరకం చూపుతున్న కోతుల సమస్యను పరిష్కరించినవాళ్లనే సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా గెలిపిస్తామంటున్నారు.

దీంతో పలువురు ఆశావహులు తమను గెలిపిస్తే కోతులన్నింటినీ పట్టించి అడవుల్లో వదలుతామని హామీ ఇస్తున్నారు. మరికొందరైతే ఇప్పటికే రంగంలోకి దిగి కోతులను పట్టే పనిలో బిజీ అయ్యారు. ఇంకొందరు ఆశావహులైతే ఇప్పటికే కోతులను పట్టించి, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎదురుచూస్తున్నారు. మొత్తమ్మీద ఈసారి కోతుల అంశం సర్పంచ్ఎన్నికల ఎజెండాగా మారడం విశేషం. గతంలోనూ ఇలా కోతుల బెడద నివారిస్తామని హామీ ఇచ్చినవాళ్లు భారీ మెజారిటీతో గెలుపొందారు.
కాగా, కోతుల భయానికి కిరాణాలను ఐరన్గ్రిల్స్ తో మూసేసి చిన్న కౌంటర్ ద్వారా సరుకులు అమ్మాల్సి వస్తోంది. లేదంటే దుకాణాలను లూటీ చేస్తున్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు కొండెంగకు సైతం భయపడే కోతులు, గుంపులో ఉన్నప్పుడు సింహాల్లా మనుషులపై ఎగబడ్తున్నాయి. తమపై మనుషులు దాడి చేస్తున్నప్పుడో, ఫుడ్దక్కకుండా అడ్డుకుంటున్నప్పుడో అటాక్చేస్తున్నాయి. ఇలా కోతుల దాడుల్లో రాష్ట్రంలో ఏటా వెయ్యి మందికి పైగా గాయపడ్తుండగా, పదులసంఖ్యలో మరణిస్తున్నారని అధికారులు చెప్తున్నారు.