విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబడుతూ, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన పొందుతోంది. మరాఠా వీరుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.
స్పెషల్ స్క్రీనింగ్
ఈ చిత్రాన్ని పార్లమెంట్లో ప్రదర్శించనున్నట్లు సమాచారం. పార్లమెంటు బాలయోగి ఆడిటోరియంలో గురువారం స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక ప్రదర్శనను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరవుతారని ఊహాగానాలు ఉన్నాయి. అలాగే విక్కీ కౌశల్ సహా చిత్ర బృందం కూడా ఈ ప్రదర్శనకు హాజరవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
‘ఛావా’ సెన్సేషన్
‘ఛావా’లో శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్,ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన్నా,ప్రధాన ప్రతినాయకుడు ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా కనిపించారు.విక్కీ కౌశల్ నటనపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్ హైలైట్గా నిలిచాయి.రూ.500 కోట్ల మార్కును దాటేసిన ‘ఛావా’,విక్కీ కౌశల్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా.ఇటీవల విడుదలైన తెలుగు వెర్షన్ కూడా సూపర్ హిట్ అయ్యింది.బాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయిన ఈ చిత్రం, ప్రభుత్వం నుండి ప్రత్యేక గౌరవం పొందడం సినిమాకు మరింత గౌరవాన్ని తీసుకువచ్చింది. పార్లమెంట్ తో ఈ సినిమా ప్రదర్శనపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రధాని మోదీ ప్రశంసలు
ఇటీవల జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఛావా సినిమా పై ప్రశంసలు కురిపించారు. ఛావా సినిమా పేరు ప్రస్తుతం అంతటా వినిపిస్తోందని మోదీ అన్నారు. దేశంలో మరాఠీ భాష చాలా గొప్ప సాహిత్యాన్ని అందించిందని, మహారాష్ట్ర ప్రజలు గతంలో సైన్స్, ఆయుర్వేదం, లాజికల్, రీజనింగ్ వంటి వాటికి అద్భుతమైన కృషి చేశారని మోదీ అన్నారు. మహారాష్ట్ర, ముంబై కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించిందని మోదీ చెప్పుకొచ్చారు.’ఛావా’ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని అభిప్రాయపడ్డారు.