పాకిస్థాన్కు ఐఎంఎఫ్ (IMF)రుణం మంజూరు విషయంలో మోదీ సర్కార్ ‘అమెరికా ఒత్తిడికి తలొగ్గింది’ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఉగ్రవాదులను ప్రోత్సహించే పాకిస్థాన్కు రుణాలు మంజూరు చేసే అంశంపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) (IMF) పునరాలోచన చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరిన ఒక రోజు తరువాత కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
భజనలు కాదు.. భారత్కు నో ఓటు అవకాశం ఉంది – జైరామ్ రమేశ్
ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశంలో పాకిస్థాన్కు రుణాలు మంజూరు చేయడంపై చర్చ జరుగుతున్నప్పుడు మోదీ సర్కార్ అమెరికా ఒత్తిడికి తలొగ్గింది. అందుకే మే 9న ఐఎంఎఫ్ (IMF) మీటింగ్కు భారత్ గైర్హాజరయ్యింది. మోదీకి ఎప్పుడూ భజనలు చేసేవాళ్లు, చీర్ లీటర్లు భారత్కు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం ఇదేనని చెప్పారు. కానీ అది పూర్తిగా అబద్ధం. ఎగ్జిక్యూటివ్ బోర్డ్లో ‘నో ఓటు’ వేయడానికి అవకాశం ఉంది. 2016 సెప్టెంబర్లో ఉక్రెయిన్కు రుణం మంజూరు ప్రతిపాదన వచ్చినప్పుడు రష్యా నో ఓటు హక్కును వినియోగించుకుంది. 2005 సెప్టెంబర్ 11న జింబాబ్వే బహిష్కరణ అంశంపై భారత్ కూడా నో ఓటు వేసింది. ఏదేమైనా, సంకల్పం ఉంటే మార్గం ఉంటుంది. కానీ మోదీ సర్కార్, పాక్కు రుణాలు మంజూరు చేయడానికి ఐఎంఎఫ్ తీర్మానించినప్పుడు మిన్నకుండిపోయింది. కానీ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ దాని గురించి పునరాలోచన చేయాలని కోరడం విడ్డూరంగా ఉంది.

ఉగ్రవాదానికి ఊతమిచ్చే నిధులపై ఆందోళన
మే 9న వాషింగ్టన్లో జరిగిన బోర్డ్ సమావేశంలో ఐఎంఎఫ్ పాకిస్థాన్కు 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం నిర్ణయించింది. దీనిని వ్యతిరేకించిన భారత్, ఇస్లామాబాద్ సదరు నిధులను ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలకు తగినంత నిధులు సమకూర్చుకోవడానికి వినియోగించవచ్చని పేర్కొంది. పాకిస్థాన్కు ఐఎంఎఫ్ మంజూరు చేసిన $1 బిలియన్ రుణం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.ఈ నిధులు మురిద్కే, బహావల్పూర్లో ఉన్న ఉగ్ర సంస్థలకు మౌలిక సదుపాయాల కోసం వాడుకునే ప్రమాదం ఉందని భారత్ పేర్కొంది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలు పునరుద్ధరించబడే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది.
రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
గుజరాత్లోని భుజ్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అక్కడి యోధులతో ముచ్చటించారు. పాక్కు ఐఎంఎఫ్ ఆర్థిక సాయం అందించకూడదని పేర్కొన్నారు. ఒక వేళ అలాంటి సాయం ఏదైనా చేస్తే ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. ‘ముఖ్యంగా మురిద్కే, బహవాల్పూర్ల్లో ఉన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులకు మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి పాక్ ఐఎంఎఫ్ నిధులు వాడుకునే అవకాశం ఉంది’ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు.ఐఎంఎఫ్–పాకిస్థాన్ రుణం అంశం భారత్లో రాజకీయం వేడెక్కిన మరో ఉదాహరణ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన వైఖరిని ప్రకటించిన మోదీ ప్రభుత్వం, అదే సమయంలో అంతర్జాతీయ వేదికల్లో ఎందుకు చురుకైన పాత్ర పోషించలేకపోయిందనే సవరణలు కాంగ్రెస్ తరపున వచ్చాయి. ఇది కేవలం ఓ వాణిజ్య తీర్మానమే కాకుండా జాతీయ భద్రత, దౌత్య వ్యూహాల సమస్యగా మారుతోంది.
Read Also: Kedarnath: కేదార్నాథ్లో కూలిన హెలికాప్టర్.. తప్పిన ప్రాణాపాయం!