హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని కవిత ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి.. ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం, రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికలలో గెలిచాక మరో మాట.. ఇదీ రేవంత్ రెడ్డి గారి రెండు నాల్కల ధోరణి అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
” ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికలలో గెలిచాక మరో మాట.. ఇదీ రేవంత్ రెడ్డి గారి రెండు నాల్కల ధోరణి. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లిలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
రుణాలు మాఫీ చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, డబ్బులు కట్టాలంటూ అంకోల్ తండాలో రైతులపై ఒత్తిడి తీసుకురావడం, బలవంతంగా భూముల వేలానికి ప్రయత్నించడం నియంతృత్వ పాలనను తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి.. ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం , రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనం.” అంటూ ట్వీట్ చేశారు.