హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ తోపాటు సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యం మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరు చీఫ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటామని, పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఓటింగ్కు మరో వారం రోజులు
ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం వీరంతా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఓటింగ్ కు మరో వారం రోజుల వరకూ ఉండటంతో.. ఎన్నికల వ్యూహంపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల సంఖ్యను బట్టి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కగా.. వాటిలో తన మిత్రపక్షం సీపీఐకి ఒక స్థానాన్ని కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణలో మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 20న ఎన్నిక జరగనుండగా.. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.