Jammu Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మూడు రోజులగా వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టాలని వాయిదాల పర్వం నడుస్తోంది. అయితే ఇవాళ కొందరు ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణంలో ఘర్షణ పడ్డారు. దీంతో సభను మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా వేశారు. అసెంబ్లీలో లోపల ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్, పీడీపీ ఎమ్మెల్యే వహీద్ పారా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెండు వర్గాలుగా మారిన ఎమ్మెల్యేలు.. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు.

కేంద్రం ఆమోదించిన వక్ఫ్ బిల్లుపై చర్చ
స్పీకర్ అబ్దుల్ రహీమ్ గత రెండు రోజుల నుంచి కూడా అసెంబ్లీని వాయిదా వేశారు. ఇవాళ కూడా అధికార నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యలు వెల్లోకి దూసుకెళ్లిన నినాదాలు చేపట్టారు. ఇటీవల కేంద్రం ఆమోదించిన వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత సునిల్ శర్మ కూడా వెల్లోకి దూసుకెళ్లిన ఎన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు సభలో ధర్నా చేపట్టారు. దీంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ సమయంలో హౌజ్ను స్పీకర్ వాయిదా వేశారు.