తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన రాష్ట్రానికి ఎలాంటి లాభం చేకూర్చలేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల పేరిట పెట్టుబడులు తెచ్చామని ప్రస్తావించడం అసత్య ప్రచారమని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ విధానమైందని మండిపడ్డారు.
అమెరికా, దావోస్ పర్యటనల సమయంలోనూ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చామని ప్రచారం చేసినా, అవి వాస్తవానికి దూరమని వివేకానంద పేర్కొన్నారు. అదానీ సంస్థ రూ.12 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోందని ప్రకటించినా, వాటి వల్ల రాష్ట్రానికి లాభం కలగలేదని విమర్శించారు. నిజానికి ఈ విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి మేలు జరుగలేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడుల పేరుతో తెచ్చుకున్న మొత్తం రూ.862 కోట్లు మాత్రమేనని వివేకానంద వివరించారు. ఫార్మా సిటీ, ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టులు, ఫార్ములా ఈ రేస్ రద్దు వంటి ముఖ్యమైన ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి తీరని నష్టం చేశాయని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులు కొనసాగుంటే రాష్ట్రానికి పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తాయని అన్నారు.
అదాని సంస్థ పెట్టుబడులపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన, షెల్ కంపెనీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం అనేది నిజమైన పెట్టుబడులా లేక వేరే ప్రయోజనాలతోనో అనేది ప్రశ్నించాల్సిన అంశమని తెలిపారు. గోడి కంపెనీ రూ.160 కోట్ల షెల్ కంపెనీగా ఉన్నా, రూ.8,000 కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతోందన్న విషయం ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మోసపూరితమని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న హామీలు కూడా ప్రజలను మోసం చేయడమేనని చెప్పారు. రుణమాఫీ చేయక రైతులను ఇబ్బందుల పాలు చేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. రాష్ట్రానికి తగిన విధంగా పెట్టుబడులను ఆకర్షించే విధానాలు అవలంభించాలని సూచించారు.