ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుక్కు కూలీపనుల కోసం తమిళనాడుకు వెళ్తూ మార్గమధ్యంలో తప్పిపోయాడు. 22 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నాడు. బ్రతుకుతెరువు కోసం ఊరు విడిచి వెళ్లిన అతను, అదృష్టం తిరగబడి దశాబ్దాల పాటు వెట్టిచాకిరీలో చిక్కుకుపోయాడు. తమిళనాడులో కార్మిక శాఖ అధికారుల దాడుల వల్లే సుక్కు జీవితంలో మళ్లీ వెలుగు చూసాడు.పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కొండగొఱ్ఱె సుక్కు, ఉపాధి కోసం తన గ్రామంలోని మరికొందరితో కలిసి పాండిచ్చేరికి బయలుదేరాడు. మార్గమధ్యంలో రైలు తమిళనాడులో ఓ స్టేషన్లో ఆగింది. టీ తాగేందుకు క్రిందకి దిగిన సుక్కు, తిరిగి వచ్చేసరికి రైలుఅప్పటికే వెళ్ళిపోయింది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో అతను ఎటు వెళ్లాలో పాలుపోకుండా అక్కడే ఉండిపోయాడు. రెండు రోజులు ఆకలితో తిరిగిన తర్వాత ఓ గొర్రెల కాపరి దగ్గర పనిచేయడం మొదలు పెట్టాడు.ఆ యజమాని మొదట్లో సహాయపడినట్లు కనిపించినా, అతన్ని బలవంతంగా తన వద్దే ఉంచుకున్నాడు. రోజూ కష్టపడినా, కూలీ లేకుండా పనిచేయించేవాడు. ఎక్కడికీ వెళ్లకుండా అతనిపై నిఘా ఉంచేవాడు. అలా 22 ఏళ్ల పాటు సుక్కు వెట్టిచాకిరీ చేస్తూ అక్కడే జీవితం గడిపాడు.
కార్మిక శాఖ అధికారులు
ఇటీవల శివగంగ జిల్లా కదంబకళం ప్రాంతంలో తమిళనాడు కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో సుక్కు వారి కంటపడ్డాడు. అప్పుడు అధికారులు సుక్కు తో మాట్లాడి వివరాలు సేకరించారు. తనది పార్వతీపురం మండలం జమ్మవలస అని అధికారులకు తెలియజేశాడు సుక్కు. వెంటనే తమిళనాడు కార్మిక శాఖ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు సుక్కు ఫోటో పంపించి వివరాలు తెలియజేశారు. వెంటనే కలెక్టర్ శ్యాం ప్రసాద్ పోలీసులకు ఫోటో అందజేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించాలని ఆదేశించాడు. దీంతో వెంటనే రంగంలో దిగిన పోలీసులు జమ్మవలస గ్రామానికి వెళ్లి సుక్కు ఫోటో చూయించి ఆరా తీయగా అలాంటి వారెవరు తమకు తెలియదని, ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు తెలియజేశారు. దీంతో సుక్కు ఆచూకీ కోసం పార్వతీపురం మన్యం జిల్లాలోనే మరికొన్ని గ్రామాల్లో వెదకడం ప్రారంభించారు. సుక్కు ఆచూకి తెలిసిన వారు తమకు తెలియజేయాలని పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు అధికారులు.

22 ఏళ్ల తర్వాత
అప్పారావు అసలు పేరు కొండగొఱ్ఱె సుక్కు. ట్రైన్ దిగి తప్పిపోయిన తరువాత సుక్కు అనే పేరు మార్చుకుని అప్పారావు అని పెట్టుకున్నాడు. దీంతో అప్పారావు అని అంటే ఎవరు గుర్తు పట్టలేకపోయారు. అంతేకాకుండా 22 ఏళ్లు కావడంతో అతని పోలికలు కూడా మారిపోయాయి. దీంతో అతని ఆచూకి దొరకడం సవాలుగా మారింది. చివరికి జిల్లాలో పలువురు యువకులు కూడా అతని ఫోటో పట్టుకొని వెదకడం ప్రారంభించారు. ఇందులో భాగంగా అనంతరావు టంకాల అనే యువకుడు కొండగొర్రే సుక్కు కుమార్తె పార్వతీపురం మండలం ములక్కాయవలసలో ఉందని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అలా అప్పారావు ఆచూకీ తెలుసుకొని ఎట్టకేలకు కుమార్తె కు అప్పారావును అందజేశారు. దీంతో అప్పారావు కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అంతేకాకుండా 22 ఏళ్లు కూలీ లేకుండా పని చేయించుకున్న యజమాని వద్ద నుండి కూలీ డబ్బులు అందజేయడంతో అప్పారావు జీవనోపాధికి మేకల యూనిట్ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హామీ ఇచ్చారు.