తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టత ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిశాక వెంటనే క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ విస్తరణ స్థానిక సంస్థల ఎన్నికల ముందు పూర్తవుతుందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేసినప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియజేయలేకపోయామని మంత్రి తెలిపారు. హైకమాండ్ ఈ విషయంలో తమను మందలించిందని, ఇకపై ప్రభుత్వ కార్యాచరణను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించిందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పూర్తిగా పారదర్శక విధానాన్ని పాటిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలతో ముందుకుసాగుతుందని వెల్లడించారు. అంతేకాక, ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రజాసేవలో మరింత చురుకుదనాన్ని చూపాలని మంత్రివర్గంలో కొత్త సభ్యుల ఎంపిక చేపట్టనున్నామని పొంగులేటి చెప్పారు. ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని విస్తరణను అమలు చేస్తామని, దీంతో ప్రభుత్వం అందరి ఆశలు తీర్చగలుగుతుందని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ముందు మంత్రివర్గ విస్తరణ పూర్తయితే, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయడంలో దోహదపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు చేపట్టిన ఈ చర్యలు పార్టీకి కలిసివస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.