బడ్జెట్లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు
అమరావతి: ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు.

వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకం
ఈ సందర్భంగా సభలో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందని చెప్పారు. అప్పులు తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ లేనంతగా పరిస్థితిని తీసుకొచ్చారని తెలిపారు. వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకం జరిగిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష తీర్పును వెలువరించారని, కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. సామాన్యుల సంతోషమే రాజు సంతోషమని కౌటిల్యుడు చెప్పారని… ఆయన చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అందిస్తున్నారని తెలిపారు.
తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సవాళ్లు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్వేతపత్రాల ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించామని చెప్పారు. గత ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టించిందని కేశవ్ విమర్శించారు. విపక్ష నేతలను అరెస్ట్ లు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించిందని దుయ్యబట్టారు. జీతాలను కూడా చెల్లించలేని దీన స్థితికి మన రాష్ట్రాన్ని గత ప్రభుత్వం తీసుకెళ్లిందని కేశవ్ చెప్పారు. గత ప్రభుత్వం అంతా నిర్లక్ష్యం, విధ్వంసం అని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని… ఆ సవాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతంగా ఎదుర్కొని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు.