Pension: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. సూపర్ సిక్స్ పేరిట మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తోంది. ఇక ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మేరకు ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఈ హామీని ప్రస్తావించారు. తాజాగా 50 ఏళ్లకే పింఛన్ గురించి ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

50 ఏళ్లకే పింఛన్ హామీ
ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అటు శాసనసభ, ఇటు శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటంతో నిస్సారంగా సాగుతున్నాయి. అయితే మండలిలో మాత్రం వైసీపీకి మెజారిటీ ఉండటంతో ప్రశ్నలు, సమాధానాలతో ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 50 ఏళ్లకే పింఛన్ హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు.. ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు తీసేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు, ఆరోపణలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే 50 ఏళ్లకు పింఛన్ మంజూరుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.