ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగులూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్కు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది.

ప్రస్తుతం ఇంకా మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది. ఇటీవల కాలంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగులుతున్నది. పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చలపతితో పాటు 16 మంది వరకు మావోలు ఎన్కౌంటర్లో హతమయ్యారు. తాజాగా జరిగిర ఎన్కౌంటర్లో మరో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హామీ ఇచ్చినప్పటి నుంచి.. నక్సల్స్కు వరుసగా భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కూంబింగ్ ఆపరేషన్లు చేస్తున్న పోలీసులు, భద్రతా బలగాలు.. మావోయిస్టులకు ఎప్పటికప్పుడు షాక్ ఇస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో తరచూ సెక్యూరిటీ ఫోర్స్, నక్సల్స్కు మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు.