Manchu Vishnu : శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు డైనమిక్ హీరో విష్ణు మంచు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రమోషన్లు వేగంగా సాగుతున్నాయి.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. విశేషంగా ఈ సినిమాను ఏప్రిల్ 25న గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు.అందుకు అనుగుణంగా చిత్రబృందం విస్తృతంగా ప్రమోషన్లను చేపట్టింది.ఇటీవలే రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కన్నప్ప’ టీమ్ పాల్గొని సినిమాపై అంచనాలు పెంచింది.ఈ కార్యక్రమంలో హీరో విష్ణు మంచు మాట్లాడుతూ “నేను ఆంజనేయ స్వామిని ఎంతగా ఆరాధించేవాడినో అందరికీ తెలుసు.

కానీ ‘కన్నప్ప’ చిత్రంతో శివ భక్తుడిగా మారిపోయాను.ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ పాత్ర ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించలేరు.ఈ సినిమా ద్వారా నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న గ్రాండ్గా విడుదల కానుంది” అని తెలిపారు.నటుడు బ్రహ్మాజీ తన అనుభవాన్ని షేర్ చేస్తూ “కన్నప్ప లాంటి గొప్ప చిత్రంలో భాగమవ్వడం నా అదృష్టం.ఇలాంటి అవకాశం ఇచ్చిన దర్శకుడు నిర్మాతలకు కృతజ్ఞతలు. మా అందరి కెరీర్ను ‘కన్నప్ప’ ముందు, ‘కన్నప్ప’ తరువాత అని మాట్లాడుకునేలా మారుస్తుంది. విశేషంగా నా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల కావడం నాకు ఓ గొప్ప అనుభూతి. విష్ణు నటన చూసి ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయం. సినిమా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది” అని అన్నారు.కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషించిన రఘుబాబు మాట్లాడుతూ, “ఈ చిత్రంలో నటించాలన్నది నా అదృష్టం. ‘కన్నప్ప’ అద్భుతంగా తెరకెక్కింది.
విష్ణు మంచు ఈ సినిమాతో మరో స్థాయికి ఎదుగుతారు.సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని ప్రేక్షకులు థియేటర్లలో తప్పక ఆస్వాదిస్తారు” అని ఆశాభావం వ్యక్తం చేశారు.దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాపై తన అనుభవాన్ని పంచుకుంటూ “2015లోనే విష్ణు ‘కన్నప్ప’ కథను అనుకున్నారు. 2016లో నేను శ్రీకాళహస్తికి వెళ్లి శివుడిని దర్శించుకున్నాను. అప్పుడే ఈ కథకు నేను సిద్దమయ్యాను. ఇది కేవలం సినిమా కాదు శివ లీల. ఇంతకు ముందు నేను ‘మహాభారతం’ సీరియల్ను రూపొందించాను. ఆ సీరియల్ను ప్రేక్షకులు ఎంతగానో ప్రేమించారు. అలాగే ‘కన్నప్ప’ను కూడా ప్రేక్షకులు గౌరవంగా ప్రేమగా స్వీకరిస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్లాల్ వంటి మహామహులు నటించారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు.