కర్ణాటక (Karnataka) రాజకీయాలు మరోసారి వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు నడుస్తున్నా.. తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలకు మరింత ఊతమిచ్చాయి. ముఖ్యమంత్రి మార్పును ఖండించకపోవడం, తుది నిర్ణయం అధిష్టానానిదని స్పష్టంగా పేర్కొనడం, ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామాల దిశగా సంకేతాలు ఇస్తోంది.

ఖర్గే వ్యాఖ్యలు
సోమవారం మీడియాతో మాట్లాడిన ఖర్గే, విలేకరులు అడిగిన ప్రశ్నకు ఖర్గే సమాధానమిస్తూ, “అక్టోబర్లో కర్ణాటక ముఖ్యమంత్రిని మారుస్తారని అంటున్నారు కదా?” అని అడగగా, “అది అధిష్టానం పరిధిలోని అంశం. అధిష్టానంలో ఏం జరుగుతుందో ఇక్కడ ఎవరూ చెప్పలేరు. ఈ విషయాన్ని అధిష్టానానికే వదిలేశాం, తదుపరి చర్యలు తీసుకునే అధికారం వారికే ఉంది. ఎవరూ అనవసరంగా సమస్యలు సృష్టించకూడదు” అని ఖర్గే వ్యాఖ్యానించారు.
శివకుమార్ వర్గం ధీమా వ్యక్తం
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గానికి చెందిన నేతలు నాయకత్వ మార్పుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.ఏ. ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ, “వచ్చే రెండు, మూడు నెలల్లో డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రావొచ్చు” అని అన్నారు. పార్టీ గెలుపు కోసం శివకుమార్ పడిన శ్రమ, ఆయన వ్యూహాలు అందరికీ తెలుసని, సరైన సమయంలో అధిష్టానం ఆయనకు అవకాశం ఇస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ తర్వాత రాష్ట్రంలో రాజకీయపరమైన కీలక మార్పులు ఉంటాయని కొందరు నేతలు చెబుతున్నారని, దాని గురించే తాను మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు.
కేఎన్ రాజన్న కూడా ఇటీవల మాట్లాడుతూ, సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు ఉంటాయని సంకేతాలిచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారని, తదుపరి నిర్ణయం కూడా వారే తీసుకుంటారని ఎమ్మెల్యే హుస్సేన్ గుర్తుచేశారు.
‘రోటేషన్ సీఎం’ ఒప్పందం మళ్లీ చర్చలోకి
2023 మే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఘన విజయం సాధించినప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ సమయంలో, అధిష్టానం ఇరువురి మధ్య రాజీ కుదిర్చి, సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, శివకుమార్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించింది. రెండున్నరేళ్ల తర్వాత శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా వీరి మధ్య ‘రొటేషనల్ సీఎం’ ఒప్పందం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, పార్టీ దీనిని అధికారికంగా ఎప్పుడూ ధృవీకరించలేదు. తాజా పరిణామాలతో ఈ ఒప్పందం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఖర్గే వ్యాఖ్యలతో ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపై కేంద్రీకృతమై ఉంది.
read also: Char Dham Yatra: చార్ధామ్ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత..పునఃప్రారంబమైన యాత్ర