తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కులగణన వ్యవహారం భారీ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయి. బీసీ కులగణనలో అనేక తప్పులు ఉన్నాయని, రెడ్డిల గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వానికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారుతున్నాయని భావించిన టీపీసీసీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

పీసీసీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు
ఇప్పటికే మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంపై స్పందిస్తూ, పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, పార్టీ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణకే ప్రాధాన్యత ఉంటుందని, వ్యక్తిగత అభిప్రాయాలను ప్రదర్శించడం సరైనది కాదని అన్నారు.
పార్టీ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి
మల్లన్నపై తీసుకున్న ఈ చర్య తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన కొద్దిగంటల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఘటన పార్టీ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు పంపినట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మల్లన్న మీడియా కౌంటర్
మల్లన్న సస్పెన్షన్పై ఆయన మద్దతుదారులు, క్యూగ్రూప్ మీడియా నుంచి కూడా కౌంటర్ వచ్చింది. ‘ఏం పీక్కుంటారో పీక్కోండి’ అంటూ మల్లన్న గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. ‘పులి బోన్లో నుంచి బయటకు వస్తే ఎట్లా వేటాడుతుందో చూపిస్తారు’ అంటూ ఆయన వర్గీయులు ఘాటుగా స్పందిస్తున్నారు. మొత్తంగా, తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది.