మహేశ్ బాబు అభిమానులకు మరోసారి పండగ చేసుకునే సందర్భం రాబోతోంది. 2007లో విడుదలైన ‘అతిథి’ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. మహేశ్ బాబు పాత సినిమాల్ని రీ-రిలీజ్ చేయడం ఇది కొత్త కాదు. గతంలో ‘పోకిరి’, ‘మురారి’ వంటి హిట్ సినిమాలు తిరిగి విడుదలై అభిమానుల నుంచి మంచి స్పందన పొందాయి. ఇప్పుడు అలాగే రాబోతుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అతిథి’ 2007లో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ పరంగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమా కథ, కథనాల విషయంలో కొంత మంది విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, మహేశ్ బాబు అభిమానులలో ఈ సినిమా ప్రత్యేక స్థానం పొందింది. ‘అతిథి’ చిత్రాన్ని కొత్తగా డిజిటల్ రిమాస్టర్ వర్షన్లో విడుదల కానుంది.
సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో మార్పులు చేసి ప్రేక్షకులకు నూతన అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీ ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వేసవి లో ఈ మూవీ షూటింగ్ మొదలుకాబోతుంది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే రెండేళ్ళైనా పట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో మహేష్ గత చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో సంతోషం నింపుతున్నారు నిర్మాతలు. గతంలో ‘పోకిరి’ రీ-రిలీజ్ ఘన విజయాన్ని సాధించింది. ‘అతిథి’తోనూ అదే స్థాయి స్పందన ఉండే అవకాశం ఉందని మహేశ్ బాబు అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలి.