బీజింగ్ : నిన్న మొన్నటి వరకు భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన చైనా ఇప్పుడు స్వరం మార్చింది. ట్రంప్ సుంకాల పెంపుతో చిక్కుల్లో పడే ఛాన్స్ ఉండటంతో భారత్వైపు స్నేహ హస్తం చాచింది. సహకరించుకుందాం రమ్మంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పిలుపునిచ్చారు. ఒకరికొకరు అండగా రెండు దేశాలూ అభివృద్ధి చెందాలి. అదే ఉమ్మడి లక్ష్యం కావాలి. పోరాడుతూ కూర్చోవడం కంటే సహకారం అందించుకోవడం మేలు అని ఆయన పేర్కొన్నారు. ఆసియాలోనే కీలకమైన తమ రెండు దేశాల మధ్య సహకారం అత్యంత ముఖ్యమన్నారు. దీనిని ఆయన సమన్వయంతో చేసే నృత్యంతో పోల్చారు.

చర్చల ద్వారా పరిష్కారం కానీ సమస్యే లేదు
ఢిల్లీ, బీజింగ్ మధ్య మెరుగైన సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సౌత్ దేశాలకు కూడా ప్రయోజనమన్నారు. అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి.. అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ సౌత్ (పేద దేశాల) స్థానాన్ని శక్తిమంతం చేస్తుందన్నారు. ఇరుదేశాల మధ్య వివాదాలను దౌత్యమార్గంలో పరిష్కరించుకొంటామని.. సమష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి సహకారం అవసరమని వాంగ్ అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా పరిష్కారం కానీ సమస్యే లేదు. అదే సమయంలో సహకారంతో చేరుకోలేని లక్ష్యాలు లేవు అని వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల భేటీలో భారత మంత్రి జైశంకర్తో చైనా మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు.
ఇరుదేశాల బలగాలు వెనక్కి తగ్గి పాత స్థితికి
ఆ తర్వాత కొన్ని వారాల్లోనే ఈ ప్రకటనలు వెలువడ్డాయి. వాస్తవానికి 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు అట్టడుగుస్థాయికి పడిపోయాయి. ఆ తర్వాత పలు విడతలుగా ఇరుదేశాలకు చెందిన దౌత్యవేత్తలు, సైనికాధికారులు చర్చలు జరిపారు. 2024లో ప్రధాని మోడీ-చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్లో భేటీ అయ్యారు. ఆ తర్వాతనే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నచోట్ల నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి తగ్గి పాత స్థితికి చేరుకొన్నాయి. మరోవైపు ఈ ఏడాది చైనా షాంఘై సహకార సంస్థ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. భారత ప్రధాని మోడీ అందులో పాల్గొనడం అత్యంత కీలకంగా మారనుంది.