భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం విశిష్ట నేతను కోల్పోయిందని, ఆయన సేవలను ఎప్పటికీ మరిచిపోలేమని మోదీ పేర్కొన్నారు. నిరాడంబర కుటుంబం నుంచి వచ్చిన మన్మోహన్ సింగ్, ఆర్థిక రంగంలో చేసిన మార్పులతో దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు. ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనతో అనేక సార్లు చర్చలు జరిగాయని, ఆయనలోని విజ్ఞానం, వినయం తనను ఎంతో ప్రభావితం చేశాయని గుర్తుచేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మన్మోహన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. తాను ఒక గురువును, మార్గదర్శిని కోల్పోయానని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానిగా ఆయన దేశాన్ని సమగ్రతతో నడిపించారని, ఆర్థిక రంగంలో చేసిన కృషి కోట్లాది మంది జీవితాలకు మార్గదర్శకంగా నిలిచిందని కొనియాడారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా మన్మోహన్ సింగ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం విషమంగా మారడంతో ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న ప్రియాంక, కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, పార్టీపై ఆయన చూపిన ప్రేమ దేశ రాజకీయ చరిత్రలో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో శరద్ పవార్ పదేళ్లపాటు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో సింగ్తో ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు. ఆయన్ని ప్రపంచ నాయకుడిగా అభివర్ణించారు. మన్మోహన్ సింగ్ మరణవార్త తెలిసి చాలా బాధగా ఉంది. మన దేశం గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిని, దూరదృష్టి గల సంస్కరణవాది ,ప్రపంచ రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని అన్నారు. పవార్ ఇంకా ఏమన్నారంటే… “ఆయన మరణం భరించలేని లోటు – ఆయన వినయం, సహనం, సహనం కరుణకు ప్రతిరూపం. భారతదేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఎల్లప్పుడూ రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ” అని తెలిపారు.
దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని సీఎం నితీశ్ అన్నారు. “నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త , ఆర్థికవేత్త. ఆయన నాయకత్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొత్త దిశలో నిలిచింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ మరణం భారత రాజకీయాలకు తీరని లోటు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.”
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సైట్ ఎక్స్లో మాయావతి గొప్ప వ్యక్తి అని అన్నారు. BSP చీఫ్ ఇలా రాశారు”దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణవార్త చాలా బాధాకరం. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో ఆయన విశేష కృషి చేశారు. ఒక గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులకు, ప్రియమైన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి.”
ఎన్సిపి (ఎస్పి) ఎంపి, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మాట్లాడుతూ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఆయన దార్శనిక నాయకత్వం, అచంచలమైన అంకితభావం భారతదేశాన్ని కీలక సమయాల్లో ముందుకు నడిపించాయి. ఆయన అభివృద్ధిని తీర్చిదిద్దారు. ఆయన వివేకం వినయం దేశం ఎప్పటికీ మరువదు.” అన్నారు.