తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి చర్చలకు దారితీసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ (KTR) ను “మానసిక రోగి”గా అభివర్ణిస్తూ, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు విషయంపై చేసిన వ్యాఖ్యలను “పిచ్చికి పరాకాష్ట”గా అభివర్ణించారు.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ – “యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అలాంటప్పుడు యూరియా ఇస్తేనే ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తామని కేటీఆర్ చెప్పడం పూర్తిగా అర్థరహితం. రైతుల సమస్యలతో జాతీయ రాజకీయాలను ముడిపెట్టడం అనవసరం. అసలు మద్దతు ఇవ్వాలనుకుంటే నేరుగా ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తున్నామని చెప్పాలి. ఇలాంటి నాటకాలతో ప్రజలను మోసగించలేరు” అని తేల్చి చెప్పారు.
ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలవడానికి
అంతేకాకుండా గత లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి “అవయవదానం” చేసినట్లు రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలవడానికి కారణం బీఆర్ఎస్ తీరేనని ఆయన సూటిగా పేర్కొన్నారు. మెదక్లో కేసీఆర్, హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా బీజేపీ గెలవడం, బీఆర్ఎస్ ప్రజల్లో కోల్పోయిన విశ్వాసానికి నిదర్శనమని రేవంత్ (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు.కేసీఆర్, హరీశ్ రావు ప్రాతినిధ్యం వహించే మెదక్లోనూ బీజేపీ గెలవడం బీఆర్ఎస్ పతనావస్థకు నిదర్శనమన్నారు.గత ప్రభుత్వ హయాంలో తనను రాజకీయంగా దెబ్బతీయాలని అనేక ప్రయత్నాలు జరిగాయని రేవంత్ గుర్తుచేసుకున్నారు. “ఆయన రాజకీయ ప్రత్యర్థిని నేనేనని కేసీఆర్కు తెలుసు. అందుకే నాపై అక్రమంగా 181 కేసులు బనాయించారు. ఎన్నికల సమయంలో నా ఇంటిని కూల్చేసి, నన్ను కిడ్నాప్ చేశారు. కానీ ఆ కేసులే నాకు మెడల్స్ అయ్యాయి” అని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబుతో సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు
30 రోజులకు మించి జైలులో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన కేంద్రం బిల్లును రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, విపక్ష సీఎంలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ బిల్లు తెస్తున్నారని ఆరోపించారు. ఇక జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ తన రాజకీయ అంచనాలు ఎప్పుడూ తప్పలేదని “2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం. ప్రధాని మోదీకి 2029 ఎక్స్పైరీ డేట్. ఈ విషయం రాసిపెట్టుకోండి” అన్నారు.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తాను చంద్రబాబుతో సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. “చంద్రబాబు అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త. ఆయనను నేను గౌరవిస్తాను. కానీ నాకు నా పార్టీ, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం” అని స్పష్టం చేశారు. తాను విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశానే తప్ప, బీజేపీలో ఎన్నడూ పనిచేయలేదని, ఇప్పుడు తాను ‘కాంగ్రెస్ యూనివర్సిటీ’లో ఉన్నానని రేవంత్ రెడ్డి వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: