Supreme Court : నేమ్ బోర్డుల్లో ఉర్దూను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భాష అనేది మతం కాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోని నేమ్ బోర్డులపై మరాఠీతో పాటు ఉర్దూను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్రలోని అకోలా జిల్లా పాటూరు మాజీ కౌన్సిలర్ వర్షతాయ్ సంజయ్ బగాడే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మున్సిపల్ కౌన్సిల్లో జరిగే పనులన్నీ మరాఠీలోనే నిర్వహించాలని.. ఉర్దూను సైన్ బోర్డులపై ఉపయోగించడానికి అనుమతించకూడదని తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతకుముందు ఆమె అభ్యర్థనను మున్సిపల్ కౌన్సిల్ తిరస్కరించింది.

భాష అనేది ఒక సంస్కృతి. సమాజం, ప్రజల నాగరికత
ఆ తర్వాత బాంబే హైకోర్టులో పిటిషన్ వేయగా.. అక్కడా అనుకూలంగా ఫలితం రాలేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సుధాంశ్ ధులియా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భాష ఒక సమాజానికి, ఒక ప్రాంతానికి, ప్రజలకు చెందినది. ఒక మతానికి సంబంధించినది కాదు. భాష అనేది ఒక సంస్కృతి. సమాజం, ప్రజల నాగరికత పురోగతిని కొలవడానికి ఇది ఒక కొలమానం. ఉర్దూ విషయంలో కూడా అంతే అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఉర్దూ వాడకంపై నిషేధం లేదు
స్థానికులు చాలా మంది ఆ భాషను అర్థం చేసుకున్నందున ఉర్దూను నేమ్బోర్డుల్లో మున్సిపల్ కౌన్సిల్ అలానే ఉంచిందని కోర్టు వ్యాఖ్యానించింది. మున్సిపల్ కౌన్సిల్ చేయాల్సిందల్లా సమర్థవంతమైన కమ్యూనికేషన్ను రూపొందించడమే అని పేర్కొంది. 2022 చట్టం లేదా ఇతర ఏ చట్టంలోని నిబంధనల్లోనూ ఉర్దూ వాడకంపై నిషేధం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తాము ఏకీభవిస్తున్నామని చెప్పి అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్ను కొట్టివేసింది.
Read Also: ఔరంగజేబు సమాధిని రక్షించాలంటూ ఐక్యరాజ్యసమితికి లేఖ