ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారని అనడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు వంతపాడుతున్నారని విమర్శించారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ “చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాకే AR సప్లైస్ సంస్థ ద్వారా నెయ్యి సరఫరా మొదలైంది. మరి మా హయాంలో లడ్డూ ప్రసాదం ఎలా కల్తీ అవుతుంది?” అంటూ ప్రశ్నించారు. టీటీడీ ప్రసాదానికి సంబంధించి అప్రస్తుతం ఆరోపణలు చేయడం దారుణమని, ఇది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడారని చేయబడిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని అంబటి స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను దెబ్బతీయడం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుట్ర అని ఆయన ధ్వజమెత్తారు. అసలు విషయం దాచి ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వ మార్పు తర్వాత అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. “టీటీడీ పరిధిలో తయారయ్యే లడ్డూ ప్రసాదం ఎప్పటిలాగే పవిత్రంగా, భక్తుల నమ్మకానికి అనుగుణంగా ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు.