KTR : టీడీపీ ఘనత ఎన్టీఆర్కే చెందుతుందన్న కేటీఆర్ బారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25 ఏళ్ల విజయ యాత్రను పురస్కరించుకుని పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ ప్రత్యేక సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్లకు పైగా ప్రజాస్వామికంగా విజయవంతంగా కొనసాగుతున్న రెండు ప్రధాన పార్టీలు మాత్రమే ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. అందులో ఒకటి తెలుగుదేశం పార్టీ (టీడీపీ), మరొకటి బీఆర్ఎస్ అని ఆయన తెలిపారు. ఆ సమయంలో తెలుగు ప్రజలను “మద్రాసీలు” అని పిలిచేవారని, తెలుగువాళ్లకు ప్రత్యేక గౌరవం తీసుకురావడానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ చేసిన కృషి వల్లే తెలుగు ప్రజలకు భారతదేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

తెలుగువారికి ప్రత్యేక గౌరవం తీసుకురావడంలో ఎన్టీఆర్ ఎంత ముఖ్యపాత్ర పోషించారో, అదే విధంగా తెలంగాణ కోసం కేసీఆర్ కూడా పోరాడారని కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడి పార్టీ స్థాపించగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ధైర్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ ను ముందుకు నడిపించారు అని ఆయన వివరించారు. శూన్యం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించిన గొప్ప నేత కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. బీఆర్ఎస్ 25 సంవత్సరాల విజయాన్ని ఘనంగా జరుపుకోవడానికి పార్టీ నేతలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు అభిమానులు ఈ వేడుకలకు సమాయత్తమవుతున్నారు. కేటీఆర్ నేతృత్వంలో ఉత్సవాలకు సంబంధించిన ముఖ్య అంశాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ భవిష్యత్తు కార్యచరణ, వచ్చే ఎన్నికల వ్యూహంపై కూడా కేటీఆర్ దృష్టిపెట్టారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన మార్గాలను పరిశీలిస్తున్నామని ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.తెలంగాణ రాజకీయ చరిత్రలో బీఆర్ఎస్ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 25 ఏళ్ల విజయాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు పార్టీ భవిష్యత్తు దిశను నిర్దేశించనున్నాయి.