KTR : ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చామంటూ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇదే ఇందిరమ్మ పాలన ఇప్పుడు రైతుల గుండెల్లో గునపం దించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ నేతలు అక్షరాలా 420 అబద్ధపు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. రుణమాఫీ, రైతుభరోసా అంశాలపై అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనను తప్పుబట్టిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు మాత్రం రూ. 2 లక్షలు దాటితే మాఫీ వర్తించదని చెప్పడం ఓ మహా మోసం అని ఆరోపించారు. ‘అబద్ధపు హామీలు ఇచ్చినందుకు మిస్టర్ రాహుల్ గాంధీ, మాఫీ మాంగో తెలంగాణసే’ అంటూ తన ట్వీట్లో ఎద్దేవా చేశారు.

అధికారంలోకి రావడానికి అందరికీ రుణమాఫీ అనే మాట ఇచ్చిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చాక మాత్రం కొందరికే వర్తిస్తుందని మాట మార్చారని మండిపడ్డారు.చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ తూట్లు పొడిచిందని ఆరోపించారు. ‘నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా.పెట్టెలో ఓట్లు పడ్డాయ్, జేబులో నోట్లు పడ్డాయ్.ఢిల్లీకి మూటలు ముట్టాయ్.ఇప్పుడు వాగ్దానాలేంటో పట్టించుకోవడం లేదు’ అంటూ కాంగ్రెస్ పాలనను ఎద్దేవా చేశారు.తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని గుర్తించి త్వరలోనే సరైన బుద్ధి చెబుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసిన పాపానికి కాంగ్రెస్ త్వరలోనే ప్రజల కోపాన్ని ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు.