KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. బ్రిటన్లో జరిగే ‘ఐడియాస్ ఫర్ ఇండియా-2025’ సదస్సుకి రావాలంటూ బ్రిడ్జ్ ఇండియా సంస్థ ప్రత్యేకంగా కేటీఆర్ను ఆహ్వానించింది. మే 30 తేదీన లండన్లోని రాయల్ లాంకాస్టర్ హోటల్లో జరిగే సదస్సుకు కేటీఆర్ను ముఖ్య వక్తగా పిలుస్తూ, బ్రిడ్జ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రతీక్ దత్తానీ తాజాగా ఆహ్వాన లేఖ పంపారు. గత 2023లో ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నాయని ప్రతీక్ పేర్కొన్నారు. ఈసారి కూడా లండన్ వ్యాపార వర్గాలు, ఇండో-యూకే కారిడార్లోని ముఖ్య వ్యక్తులు, తెలుగు ప్రవాసులు కేటీఆర్ను కలవడానికి, ఆయన ప్రసంగాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటికీ కేటీఆర్ను ప్రత్యేకంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానిస్తున్నామని ప్రతీక్ దత్తానీ లేఖలో ప్రస్తావించారు.

ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సు
ఈ కార్యక్రమానికి హాజరైతే భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశం కలగడంతో పాటు, తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఏర్పడే అవకాశం ఉందని ప్రతీక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సుకి భారత్-బ్రిటన్ వ్యాపార రంగ ప్రముఖులు, పాలసీ మేకర్లు, తెలుగు ప్రవాసులు సహా 900 మందికి పైగా ప్రముఖులు హాజరవుతారు. ఈ వేదికలో భారత ఆర్థిక ప్రగతి, విదేశీ పెట్టుబడుల అవకాశాలు, వాణిజ్య సంబంధాల పురోగతి వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. కేటీఆర్ తన పర్యటనలో బ్రిటన్ పారిశ్రామికవేత్తలు, తెలుగు ప్రవాసులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు.
