హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది రైతు రాజ్యం కాదని, రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిదంటూ ఫైరయ్యారు. ఒకే రోజు నలుగురు రైతులను పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిదని మండిపడ్డారు. కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్. ఆత్మహత్యలు కాదివి ముమ్మాటికి మీరు చేసిన హత్యలు. రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు. రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలు. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయి. వారి కన్నీళ్లే కపట సర్కార్ను కూల్చి వేస్తాయని ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని, తోడేళ్లలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమని చెప్పారు.
రాష్ట్రంలో ఆందోళనకర స్థాయికి చేరిన రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై బీఆర్ఎస్ పార్టీ 9 మందితో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ప్రకటించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి, వ్యవసాయ కమిషన్కు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివేదికను అందజేస్తుందని కేటీఆర్ తెలిపారు.

రెండు వారాలపాటు విస్తృతంగా పర్యటించి రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్న ప్రధానమైన కారణాలతోపాటు రాష్ట్రంలో ఏడాది నుంచి వ్యవసాయ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించి నివేదిక తయారు చేస్తుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సన్న, చిన్నకారు, కౌలు రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటుందని వివరించారు. ‘‘ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిది!.రైతు రాజ్యం కాదిది..రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిది!. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది.. తోడేళ్ళలా ప్రాణంతీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిది!. కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్. ఆత్మహత్యలు కాదివి ముమ్మాటికి మీరు చేసిన హత్యలు. రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు. రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలు. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయి. వారి కన్నీళ్లే కపట సర్కార్ ను కూల్చి వేస్తాయి..అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.