Konda Surekha : 18 మంది సభ్యులతో వైటీడీ ట్రస్టు బోర్డు ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి నూతన పాలక మండలి (ధర్మకర్తల మండలి) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శాసనసభలో ప్రకటించారు.

18 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు
శాసనసభలో దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, యాదగిరిగుట్ట ఆలయానికి 18 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డు (వైటీడీ) ఏర్పాటయ్యేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ బోర్డు పదవీకాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించారని, బోర్డు సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని స్పష్టంచేశారు.
వైటీడీ బోర్డుకు ప్రత్యేక అధికారాలు
కొండా సురేఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ధర్మకర్తల మండలి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడమే కాకుండా, విద్యా సంస్థలు స్థాపించడానికి, వాటిని నిర్వహించడానికి కూడా అధికారం కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఆలయ పరిపాలన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ను అనుమతిస్తుందని తెలిపారు.
ఆలయ అభివృద్ధిపై మంత్రి స్పష్టత
గతంలో యాదగిరిగుట్ట ఆలయ భక్తులకు తగినంత సౌకర్యాలు లేవని, భక్తుల కోసం భారీ మొత్తంలో ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు వెచ్చించామని మంత్రి తెలిపారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పాలక మండలి అవసరమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణలో ఆలయ పరిపాలన మరింత పారదర్శకంగా ఉంటుందని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. దేవాదాయ శాఖ పరిధిలో ఏటా రూ.100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలను ప్రభుత్వమే నేరుగా నిర్వహించనుందని వివరించారు.