TTD : తిరుమల శ్రీవారి ఆలయంలో తెలుగు నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని అన్నారు. శ్రీవారి ఆలయంలో ఉత్సవాలకు ముందు మంగళవారం తిరుమంజనం చేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.

మూలమూర్తికి ప్రత్యేక పూజలు
ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆణివార ఆస్థానం తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తామని, ఆలయ ప్రాంగణం, ఆలయ గోడలు, ఆలయ పైకప్పు, దేవత మూర్తులు, పూజ సామాగ్రిని శుద్ధి చేశామని వివరించారు. మూలమూర్తిపై వస్త్రం కప్పి సుగంధ ద్రవ్యాలతో ఆలయ మొత్తం సంప్రోక్షణ చేశామని కార్యక్రమం అనంతరం మూలమూర్తికి ప్రత్యేక పూజలు, నివేదనలు అర్చకులు సమర్పిస్తారని ఈవో తెలిపారు.

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ అధకారులు రద్దు చేశారు. 25వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని అధికారులు తెలియజేశారు. 30న ఉగాది ఆస్థానం ఉంటుందని పేర్కొన్నారు.