మాజీ మంత్రి కొడాలి నాని ముంబయిలోని ఏషియన్ హార్ట్ హాస్పిటల్లో గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఆయన మరో మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటారని తెలిసింది.గత వారం రోజులుగా కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా, గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

హృదయంలోని మూడు వాల్వ్లలో సమస్యలు ఉన్నాయని నిర్ధారణ కావడంతో, స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు.మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయనను ముంబయికి తరలించారు.ఈ క్రమంలోనే ఈరోజు ముంబయిలోని ఏషియన్ హార్ట్ హాస్పిటల్లో శస్త్రచికిత్స జరిగింది. ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని వైద్య బృందం దాదాపు 10 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు, ఆయన మద్దతుదారులు ఊపిరిపీల్చుకున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని తిరిగి ప్రజల మధ్యకి రాబోతున్నారని సమాచారం.