రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ నేతల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రంలో ఓట్లు, జనాభా తగ్గినప్పటికీ ఒక్క పార్లమెంటు స్థానం కూడా తగ్గదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హిందీ భాషను ఎవరికీ బలవంతంగా రుద్దడం లేదని స్పష్టంచేశారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని సూచించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి రీజినల్ రింగ్ రోడ్డు (RRR) గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తికావాలంటే ఫైనాన్స్కు సంబంధించిన ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందని అన్నారు. గడ్కరీకి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటివరకు 10 జాతీయ రహదారులను పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.

జాతీయ రహదారుల ప్రారంభోత్సవం
పార్లమెంటు సమావేశాల అనంతరం ఈ 10 జాతీయ రహదారులను ప్రారంభించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఆ ప్రారంభోత్సవానికి నితిన్ గడ్కరీ హాజరవుతారని చెప్పారు. RRR ఉత్తర భాగం విషయంలోనూ గడ్కరీతో చర్చించినట్లు తెలిపారు. భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 50% వ్యయం భరిస్తుందని, అయితే ఫ్లైఓవర్ల కింద భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని సూచించారు. అప్పుడు మాత్రమే రోడ్డు నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయగలమని అన్నారు.
అదికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద భూసేకరణ పూర్తికాకపోవడంతో నిర్మాణం నిలిచిపోయిందని ఆయన తెలిపారు. జనగాం – దుద్దెడ మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపడితే త్వరగా పనులు పూర్తి చేయగలమని స్పష్టం చేశారు. ఖమ్మం – విజయవాడ మార్గంలో వెంకటాయల్లి నుంచి బ్రాహ్మణపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల గురించి కాంగ్రెస్ తమకు బోధించాల్సిన అవసరం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు అవి అమలుకాలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. లిఖితపూర్వక హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
కొచ్చీ ఫ్యాక్టరీపై తాజా అప్డేట్
కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా జరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాదికి ఉత్పత్తి ప్రారంభం కానుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని అన్నారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.